శిరోముండనం బాధితుడితో కలిసి నిరసన దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ హర్షకుమార్

  • వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం
  • తన నివాసంలో ఒక రోజు దీక్షకు దిగిన హర్షకుమార్
  • వైసీపీలోని దళిత సంఘాలు కూడా మద్దతు పలకాలని విజ్ఞప్తి
ఇటీవల తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ శిరోముండనం బాధితుడు వరప్రసాద్ తో కలిసి ఒక రోజు దీక్ష చేపట్టారు. రాజమండ్రిలోని తన నివాసంలో ఆయన ఈ దీక్షకు కూర్చున్నారు.

 ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే కూర్చుని ఈ దీక్షకు మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శిరోముండనం వ్యవహారంలో అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుల కాల్ డేటాను పరిశీలించాలని అన్నారు. ఈ పోరాటంలో టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో పాటు వైసీపీలోని దళిత సంఘాలు కూడా మద్దతుగా నిలవాలని కోరారు. ఏపీలో దళితులపై అఘాయిత్యాలపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తానని మాజీ ఎంపీ తెలిపారు.

Harsha Kumar
Protest
Varaprasad
Tonsure
Dalits

More Telugu News